యాదాద్రి ఎంఎంటీఎస్‌ కోసం ఈ చిన్న పనిచేయండి : కోమటిరెడ్డి

0
38

మొత్తం ప్రాజెక్టు వ్య‌యం రూ. 412.26 కోట్లు
రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు 1:2 నిష్ప‌త్తిలో నిధులు విడుద‌ల‌
ప‌నులు ప్రారంభం కావాలంటే రైల్వేకు రూ. 75 కోట్లే విడుద‌ల చేయాలి
వెంట‌నే నిధులు బ‌దిలీ జ‌రిగేలా సీఎంను కోరుతున్నాను
నేను ప‌డ్డ క‌ష్టానికి ఎంఎంటీఎస్ ప్ర‌తిఫ‌లం
భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు త్వ‌ర‌గా మొద‌లు కావాలంటే రాష్ట్ర ప్ర‌భుత్వం వాటాలో మొద‌ట రూ. 75 కోట్లు విడుద‌ల చేయాలని నేడు సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి లేఖ రాశారు.

ఈ లేఖ‌లో భువ‌న‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్‌కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం ల‌భించిన‌ట్లు తెలిపారు. ప‌లుమార్లు కేంద్ర మంత్రుల‌ను, రైల్వే అధికారుల‌ను క‌లిసి విన్నవించినందుకు ఆమోదం రావ‌డం సంతోషంగా ఉందని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్త‌యితే యాద‌గిరిగుట్ట‌కు రాష్ట్ర రాజ‌ధాని నుంచి ర‌వాణా సౌక‌ర్యం చాలా సుల‌భం అవుతుంది. అలాగే భ‌క్తుల తాకిడి సైతం పెరుగుతుందని వివ‌రించారు. ఇటు భ‌క్తుల‌కు సౌక‌ర్యం, అటు యాదాద్రి అభివృద్ది కావాలంటే ఈ ప్రాజెక్టు చాలా అవ‌శ్య‌కం. అయితే ఈ ప్రాజెక్టు మొద‌లు కావాలంటే మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం కొంత చొర‌వ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర స‌ర్కార్ భ‌రించాల్సిన వ్య‌యాన్ని వెంట‌నే విడుద‌ల చేసి ప‌నులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

కాగా, రైల్వే శాఖ ఆమోదం తెలుపుతున్న‌ట్లు రైల్వే బోర్డు వ‌ర్క్స్ ఎఎం సంజ‌య్ రాస్తోగి నుంచి లేఖను అందుకున్నట్లు వివ‌రించారు. ఇందులో ప్రాజెక్టు స‌వ‌ర‌ణ వ్య‌యం రూ. 412.26 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు సాగాలంటే రాష్ట్ర ప్ర‌భుత్వం, రైల్వే శాఖ 1: 2 నిష్ప‌త్తిలో వ్య‌యం భ‌రించాల్సి ఉంటుందన్నారు.

యాదాద్రి అభివృద్దికి ఉప‌యోగ‌ప‌డే ఈ ప్రాజెక్టు మొద‌లు కావాలంటే రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుగా రూ. 75 కోట్లను రైల్వే శాఖ‌కు డిపాజిట్ చేయాలని కోరారు.

అలాగే అత్యంత ప్రాధాన్యత క‌లిగిన ప్రాజెక్టుగా భావించి రూ. 75 కోట్ల‌ను రైల్వే బోర్డుకు బ‌దిలీ చేయాల‌ని వివ‌రించారు. వీటితో పాటు ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని కేసీఆర్‌ను కోరారు.