పత్తి గింజలతో వంట నూనె, కొరతకు చెక్ : ఎక్కడో తెలుసా?

Cooking oil with cotton seeds

0
38

నేడు వంట నూనెల కొరత తీవ్రంగా ఉంది. వంట నూనెల కొరత తీర్చేందుకు పత్తి గింజలే సరైన పరిష్కార మార్గమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పత్తి గింజల నుంచి వంట నూనె, వ్యర్థాల నుంచి నూనె చెక్క తయారీకి ప్రత్యేక విధానం తీసుకురావాలనే ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు పరిశీలిస్తున్నది. దీనికోసం మిల్లుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది.
తెలంగాణలో పత్తి గింజల నుంచి నూనె తీసే మిల్లులు లేకపోవడంతో గుజరాత్, మధ్య ప్రదేశ్ నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి గింజలు కొనుక్కుని పోతున్నారు. అక్కడ ఉత్పత్తి అయిన నూనెను ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఛార్జీల భారం మీద పడి పత్తి నూనె ధర లీటరుకు 120 రూపాయలు అవుతోంది. ఇక్కడే పత్తి నూనె తీసే మిల్లులు ఉంటే ధర తగ్గుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వంటనూనెకు భారీగా డిమాండ్ ఉంది. వీటి తయారీ కోసం నూనె గింజల కొతర తీవ్రంగా ఉంది. పంటలు సరిగా పండడంలేదు. దీంతో పత్తి గింజల నూనె తీసి వంటలకు వాడటమే మేలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు రాట్ర పత్తి జిన్నింగ్ మిల్లుల సంఘం ఇచ్చిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.

తెలంగాణలో పత్తి విస్తారంగా పండుతున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ సర్కారు కూడా పత్తి పంటను భారీగా ప్రోత్సహిస్తున్నది. వరి పంట తగ్గించాలని, పత్తి వేయాలని గత కొంతకాలంగా విసృతంగా సర్కారు ప్రచారం చేస్తున్నది. ఈ వానాకాలంలో పత్తి తెలంగాణలో 75 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా ఉంది. గత జనవరిలో పత్తి గింజలు క్వింటా ధర రికార్డు స్థాయిలో 2600 పలికింది. గింజలను గానుగ పడితే నూనెతో పాటు వచ్చే వ్యర్థాలను పశువుల దానాకు, సబ్బుల తయారీకి వాడతారు.
పత్తి నూనెల ఉత్పత్తికి ప్రత్యేక విధానం తెచ్చేందుకు యోచిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు చెప్పినట్లు తెలిసింది.