ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక..డీఏ పెంపు!

Diwali gift for government employees..DA hike!

0
35

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ)ను 3 శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు 2021 జులై నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28 శాతం ఉండగా తాజా నిర్ణయంతో 31 శాతానికి చేరింది.

కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది.