తెలంగాణలో అప్పటి వరకు విద్యాసంస్థలు బంద్..అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

0
42

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కాగా గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికైతే సంక్రాంతి సెలవులతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇక తాజాగా రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సెలవులను మరోసారి పెంచనున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను బంద్‌ ఉంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆదివారం విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ముందుగా విద్యాసంస్థలను 20 వరకు పొడిగించాలని భావించారు.

కానీ  అలా కాకుండా ఎక్కువ రోజులు పొడిగిస్తే బాగుంటుందని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ రోజులు పొడిగించినట్లయితే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.