టీపీసీసీపై ఆత్మ స్కెచ్..ఖాన్ రాజీనామా వెనుక కుట్ర?

0
35

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైఎస్ ఛైర్మన్ పదవికి ఎంఎ ఖాన్ రాజీనామా చేయడం వెనుక ఏం జరిగింది? పదవీ ప్రకటన జరిగిన తర్వాత మూడు రోజులు మౌనంగా ఉన్న ఖాన్ సడెన్ గా నాకొద్దు ఈ పదవీ అని రాజీనామా పత్రం సమర్పించడం వెనుక ఏ అదృశ్య హస్తం ఉంది? టీ కాంగ్రెస్ లో ఈ ప్రకంపనలకు కేంద్ర బిందువు ఎక్కడుంది? తెలంగాణ కాంగ్రెస్ ను మరోసారి ”ఆత్మ” ఆవహించిందా? ఎంఎ ఖాన్ రాజీనామా వెనుక ఉన్న భారీ స్కెచ్ ఏమిటి? గాంధీ భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు టీపీసీసీలో తాజా రాజకీయ ఎత్తులు పై ఎత్తులపై సమగ్ర విశ్లేషణ…

“ఆత్మ” ఫాంహౌస్ పాలి” ట్రిక్స్”
మొయినాబాద్..ఔటర్ రింగ్ రోడ్డుకు 20 – 30 కిలో మీటర్ల దూరంలో ప్రముఖుల ఫాంహౌస్ లు నెలకొని ఉండే ప్రాంతం ఇది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఈ ప్రాంతంలో ఓ ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ కేంద్రంగానే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో కొత్త ఎత్తుగడలకు తెర లేచిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకనాటి “ఆత్మ” ఇప్పుడు మళ్లీ ఈ ఫాంహౌస్ కేంద్రంగా చక్రం తిప్పటం మొదలు పెట్టిందని టాక్. ఆత్మ – ఆత్మకు టీ కాంగ్రెస్ లో ఆత్మీయులు కలిసి ఈ ఫాంహౌస్ కేంద్రంగా టీపీసీసీనే టార్గెట్ గా భారీ స్కెచ్ కు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని సమాచారం. ఆ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్పే ఎంఎ ఖాన్ తాజా రాజీనామా అంటున్నారు.

“ఆత్మ” అజ్ఞానుసారం…
ఎంఎ ఖాన్… అసలు స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి ఈయన నేపథ్యం చూద్దాం. ఖాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు (2008-2014 —– 2014-2020) రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారి “ఆత్మ” సహకారంతో రాజ్యసభలోకి ప్రవేశించారు. అలా “ఆత్మ”కు ఖాన్ కు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాన్ ను సోనియాగాంధీ తాజాగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వైఎస్ ఛైర్మన్ గా నియమించారు. ఆయన ఓకే చెప్పిన తర్వాతే ఈ నియామకం జరిగిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అట్లాంటిది..ప్రకటన వెలువడిన మూడు రోజుల వరకు కామ్ గా ఉన్న ఖాన్..సడెన్ పదవి ఇచ్చే ముందు నన్ను సంప్రదించలేదు అని రాజీనామా ప్రకటించారు. ఒకవేళ సంప్రదించపోయినా, పదవి ఇష్టం లేకపోయినా పార్టీకి అంతర్గతంగా సమాచారం ఇవ్వొచ్చు, సోనియాకు లేఖ రాసి మౌనంగా ఉండొచ్చు. కానీ, రాజీనామా లేఖను మీడియాకు రిలీజ్ చేయడం “ఆత్మ” వ్యూహాంలో భాగమని చెబుతున్నారు.

“ఆత్మ” స్కెచ్ కు నేపథ్యం…
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ కు జవజీవాలు వచ్చాయన్నది వాస్తవం. భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ ఒకింత రేస్ లోకి వచ్చింది. గడచిన నాలుగు నెలల్లో పార్టీ లేచి నడవడం మొదలు పెట్టింది. ముఖ్యంగా గజ్వేల్ సభ తర్వాత కేడర్ లో భవిష్యత్ పట్ల ఆశలు చిగురించాయి. అదే సమయంలో టీ కాంగ్రెస్ పాత కాపులు కొందరికి ఈ దూకుడు అస్సలు నచ్చడం లేదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు అడపా దడపా చేస్తోన్న ప్రకటనలతో కలకలం రేగుతూనే ఉంది. ఆ ప్రకటనలు టీ కాంగ్రెస్ కు కనిపించని నష్టాన్ని మూటగడుతున్నాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన అంశం. కాంగ్రెస్ లో ఇది మామూలే అని సర్ధిచెప్పుకోవడానికి లేదు. రాజకీయాలు ఒకప్పటిలా లేవు. టీడీపీకి కాంగ్రెస్, కాంగ్రెస్ కు టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉన్న రోజుల్లో ఇవన్నీ నడిచాయి. ఇదంతా 20 ఏళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు కాలం మారింది. ప్రజలకు పొలిటికల్ ఆప్షన్స్ పెరిగిపోయాయి. నిత్యం పోటీలో ఉంటే తప్ప గెలుపు అవకాశాలు ఉండవు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ నేతలైనా చేసే చర్యలు, మాట్లాడే మాటలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తానంటే కేసీఆర్ కు సహకరిస్తానంటూ జగ్గారెడ్డి ఇటీవల కామెంట్ చేశారు.

ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా… ఆ ప్రకటన కాంగ్రెస్ కు తీరని నష్టం చేసిందనే చెప్పాలి. ఆ విషయం జగ్గారెడ్డికి తెలియదా అంటే…ఏం చెబుతాం! ఇలాంటి ప్రకటనల వెనుక “ఆత్మ” ఉన్నాడన్నది ఇన్ సైడ్ టాక్. ఇటువంటి ప్రకటనలే టీఆర్ఎస్ కు రేపటి నాడు అస్త్రాలుగా మారతాయడంలో డౌట్ లేదు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాలను కలిపేస్తుంది… ఆ విషయం మేం చెప్పడం కాదు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డే చెప్పారు…” అని ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ దీన్ని అస్త్రంగా వాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా! అన్నది కాంగ్రెస్ వర్గాల భావన. ఇటీవల కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతల ప్రకటనలను ఆసరాగా చేసుకుని కేటీఆర్, నమస్తే తెలంగాణ పత్రికల్లో వస్తోన్న కథనాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అసలు “ఆత్మ” స్కెచ్చేంటి…?
మళ్లీ ఖాన్ రాజీనామా విషయానికి వద్దాం… ఖాన్ రాజీనామా వెనుక ఆత్మ అదృశ్య హస్తం ఉందని చెబుతున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్ తో పాటు, బంజారాహిల్స్ లోని ఆత్మ అపార్ట్ మెంట్ కేంద్రంగా టీ కాంగ్రెస్ బడాబాబుల మీటింగ్స్ రెగ్యూలర్ గా జరుగుతున్నాయట. కొత్త పీసీసీ కార్యవర్గాన్ని అస్థిరపరచడమే ఈ మీటింగ్స్ లో చర్చల సారాంశంగా తెలుస్తోంది. దీనికి ఒక ఏడాది టార్గెట్ గా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీంలో ఉన్న కొందరు నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు ఆత్మ టీం సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిలో మాజీ పీసీసీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తున్నారని గుసగుస. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకుండా ఆ తాజా మాజీ పీసీసీ చివరి వరకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. టీపీసీసీలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ఓ బీసీ నాయకుడుకి వీళ్లు పీసీసీ అధ్యక్ష పదవి ఎర వేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని తప్పించే పనిలో కలిసి వస్తే తదుపరి నీకే పీసీసీ పదవి ఇప్పిస్తాం అని బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. నల్గొండ జిల్లాకు చెందిన మరో రెడ్డి నాయకుడుకి కూడా ఇదే ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా..రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగించి, ఉక్కిరి బిక్కిరి చేయడమే ఆత్మ మిషన్ గా చెబుతున్నారు. ఆ క్రమంలోనే మొదటి పావుగా ఖాన్ తో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోకపోవడంతోనే ఈ డిస్ట్రబెన్స్ అని అధిష్టానానికి చూపించడమే ఈ తాజా ఎత్తుగడ వెనుక ఆలోచనగా చెబుతున్నారు. కాలక్రమేణా అధిష్టానం వద్ద పదే పదే ఇదే విషయాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ… టైం వచ్చినప్పుడు పీసీసీ మార్పు అంశాన్ని సీరియస్ గా తెర మీదకు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఒకనాడు నాటి ముఖ్యమంత్రికి ఆత్మగా వ్యవహరించిన ఆత్మ… ఆయన పోయాక కేసీఆర్ కు ఆత్మగా మారరని టీపీసీసీలో ఒక వర్గం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడు ఆత్మ ఆపరేషన్ వెనుక కూడా కేసీఆర్ ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ బలహీనపడుతోందన్న టాక్ సీరియస్ గా నడుస్తోంది. ఈటెల గెలుపు టీఆర్ఎస్ ఓటమికి సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సైజును ఎంత తగ్గించ గలిగితే కేసీఆర్ కు అంత మేలు జరుగుతుందన్నది ఆత్మ వ్యూహంగా తెలుస్తోంది. టీ కాంగ్రెస్ మినీ కాంగ్రెస్ గా మారిపోతే… టీఆర్ఎస్ తో పొత్తు తప్ప ఆ పార్టీ ముందు మరో ఆప్షన్ ఉండదు. అంటే… సేమ్ తమిళనాడు తరహా అన్నమాట. తమిళనాడులో కాంగ్రెస్ అస్థిత్వం అంతంత మాత్రం. ఆ పార్టీకి డిఎంకేతో పొత్తు తప్ప మరో ఆప్షన్ ఉండదు. సేమ్ సీన్ తెలంగాణలో రిపీట్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. తన ఆలోచనకు “ఆత్మ” ద్వారా కార్యరూపం తీసుకురావాలన్నది కేసీఆర్ స్కెచ్ గా గాంధీ భవన్ వర్గాల్లో టాక్. అదే జరిగితే 10-15 సీట్లు తీసుకుని టీఆర్ఎస్ తో జట్టు కట్టడం ఒక్కటే కాంగ్రెస్ కు మిగులుతుంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ భవిష్యత్ ఎట్లా ఉంటుందన్నది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ద్వితియ శ్రేణి నేతలు, క్యాడర్ డిసైడ్ చేసుకోవాల్సిందే.