కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన గోల్ మాల్ గోవిందం లాగా ఉంది: సలీం పాష

0
33

తెలంగాణ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,039 ఉద్యోగాల భర్తీ ప్రకటన ఒక గోల్ మాల్ గోవిందం లాగా ఉందనిటీజేఏస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీంపాష ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో సీఏం చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. “రెండు సంవత్సరాల క్రితం బిస్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీగ ఉన్నాయని ప్రకటించింది. కానీ నేడు కేసీఆర్ 80,039 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామనం ఏంటి ? మిగతా ఒక లక్ష ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి ? దీంతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను కుదించి ప్రభుత్వం దాచిపెడుతుందని అర్థమవుతుంది. ఉద్యోగాల ఖాళీలపై స్పష్టత లేకపోగా మరింత గందరగోళంగా గురి చేశారని అన్నారు.

ఈ మిగిలిన లక్ష 10 వేల ఉద్యోగాలకు కూడా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. గత 8 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 78 వేలలోపే ఉన్నవి. కానీ విద్యుత్ శాఖలో, ఆర్టీసీలో, సింగరేణిలో రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగాలను కలిపి 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు ప్రచారం చేసుకుంటుంది.

సీఏం కేసీఆర్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అస్పష్టంగా ఉంది. దీనిలో స్పష్టత కరువైంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుందో డెడ్ లైన్ లేదు. ‌డెడ్ లైన్ లో భర్తీ కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి జాబ్ క్యాలెండర్‌ కి చట్టబద్దత ఉండాలి. కానీ సీఏం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ కి చట్టబద్దత లేదు. వెంటనే చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

మరోవైపు 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తమని ప్రకటించారు. ఏయే శాఖలలోని వారిని చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే కేవలం 11 వేలమందినే రెగ్యులరైజ్ చేయడంలో మతలబు ఏంది ? గత ఎన్నికలలో ఇచ్చిన నిరుద్యోగ భృతి గురించి పూర్తిగా మరిచిపోయారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు విడుదల చేయలేదు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత ఎనిమిది సంవత్సరాలలో 200 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. వీరి గురించి కూడా ఈరోజు సీఏం కేసీఆర్ మరిచిపోయారు. చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ సమస్యలను పరిష్కరించపోతే యువజన సమితి తరపున మా పోరాటం కొనసాగుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర నాయకులు కొత్త రవి, ఏర్ర వీరన్న, జీవన్ రెడ్డి, కిరణ్ ముదిరాజ్, గ్రేటర్ నాయకులు సుశీల్ కుమార్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.