రైతును లక్షాధికారిని చేయడమే కేసిఆర్ లక్ష్యం

0
45

రైతును లక్షాధికారిగా మార్చాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ వేదికలు దోహద పడతాయని ఆయన అన్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, నిడమనూర్ మండల కేంద్రాలతో సహా పెద్దదేవులపల్లి, ఇండ్ల కోటయ్యగూడెం, ముప్పారం గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించడం తో పాటు అనుమల మండలం హాజరిగూడెం లో చెక్ డ్యామ్ నిర్ణణాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

స్థానిక శాసనసభ్యులు నోముల భగత్ ఆధ్వర్యంలో జరిగిన ఆయా కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రామచంద్ర నాయక్,మండల కన్వీనర్ అంకతి వెంకటరమణ,యం పి పి జయమ్మ,సీనియర్ టి ఆర్ యస్ నేతలు యం సి కోటిరెడ్డి,కే. వి రామారావు లతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,వ్యవసాయశాఖాధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిడమనూర్ మండలం ముప్పారం గ్రామంలో జరిగిన సభలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. రైతు వేదికల ప్రాశస్త్యం గురించి ఆయన వివరించారు. మూస పద్ధతుల్లో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. నిడమనూర్ మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన రైతు తో ముఖాముఖి నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యామ్నాయ పంటలతో లాభాలను ఆర్జిస్తున్న రైతు నారాయణ రెడ్డి ని ఆదర్శం చేసుకోవాలన్నారు.

లక్షా 10 వేల పెట్టుబడితో ఐదు ఎకరాలలో పత్తిని సాగు చేసిన రైతు నారాయణక 4 లక్షల 50 వేలు గడించారని పెట్టుబడి పొగా 3 లక్షల 40 వేల ఆదాయం గడించారన్నారు. అంతే గాకుండా కేవలం సేంద్రియ ఎరువుల ఆధారంగా 80 వేల పెట్టుబడితో రెండు ఎకరాల విస్తీర్ణంలో మిర్చిని సాగు చేయగా అందులోనూ పెట్టిన పెట్టుబడి 80 వేలు మినహాయిస్తే 2 లక్షల 40 వేలు లాభాన్ని గడించారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నది ఇదేనని అటువంటి రైతు చేసిన సాగును రైతు వేదికలో మిగితా రైతులు తెలుసుకోగలిగితే అంతకు మించి ఆనందముండదని ఆయన అన్నారు. అదే సమయంలో రైతు నారాయణ చేస్తున్న సాగును ప్రజలకు ముఖ్యంగా రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన సూచించారు. తెలంగాణా ఏర్పాటుకు ముందు వెనుక వ్యవసాయం అనేది చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

అందుకు కారణం రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. యావత్ భారతదేశంలోనే వరి దిగుబడిలో అగ్రభాగాన ఉండేదని ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ అక్రమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వరి దిగుబడి ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా దృక్పథమే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. అంతే గాకుండా ఈ వానాకాలం పంటలకు అవసరమైన విత్తనాలు వేసవిలోనే అందుబాటులో కి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు.

తెలంగాణా ఏర్పడక ముందు కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేసుకునే గోదాములు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎరువుల ను నిలువ ఉంచుకునేందుకు వీలుగా గోదాముల నిర్మాణం గావించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు.