కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్

0
37

కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పారిశ్రామిక రంగంపై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో కొవిడ్ స‌మ‌యంలోనూ కొత్త పెట్టుబ‌డుల వృద్ధిలో ఎలాంటి త‌గ్గుద‌ల లేద‌ని స్ప‌ష్టం చేశారు. 2020-21లో 3,445 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదించాం. 2021-22 ఇప్పటివరకు 1777 కొత్త ప్రతిపాదనలు ఆమోదించాం అని కేటీఆర్ తెలిపారు.

కొవిడ్‌ మహమ్మారి ప్రారంభం నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు కేటీఆర్.