సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ : కేసిఆర్ పై కేటిఆర్ ప్రశంసలు

0
31

కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చరిత్రపుటల్లో ఉంటుందని ఆయన చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సహచర మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలసి ఈ రోజు సాయంత్రం ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు కూడలికి కల్నల్ సంతోష్ బాబు పేరు తో కూడిన బోర్డును ఆయన ఆవిష్కరించారు.

అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ కల్నల్ సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాల తో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేర వేసినట్లైందని ఆయన తెలిపారు. ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి వారి కుటుంబాలకు భారతప్రజలు అండగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయానికి సందేశం అని ఆయన చెప్పారు. భారత్ -చైనా సరిహద్దుల్లో కల్నల్ సంతోష్ బాబు చనిపోతే ఆయన భౌతిక ఖాయన్ని తెలంగాణా ప్రభుత్వం హకింపేట వద్ద నుండి సూర్యాపేట వరకు తీసుకు వస్తున్నప్పుడు దారిపోడువునా ప్రజలు నీరాజనం పలికిన తీరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశానికి అద్దం పడుతుందన్నారు.అటువంటి త్యాగానికి ఏమియిచ్చినా సరిపోదని దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి వెంట తెలంగాణా ప్రభుత్వం,ప్రజలు ఉంటారు అని తెలియ జెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పునట్లుగా పుట్టిన వారు మరణించక తప్పదని, జీవించినంత కాలం ఎలా బతికి ఉన్నామన్నది ముఖ్యమని ఆయన అన్నారు. ఆ కోవలోనే కల్నల్ సంతోష్ బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారన్నారు. అటువంటి మహనీయుడు ప్రాణ త్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సహచర మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ ప్రశంశించారు. మంత్రులుగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నా కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా జరగడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు.

విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీనివాస రెడ్డి ని మంత్రి కేటీఆర్ అభినందిస్తూ ఈ సందర్భంగా ఆయనను శాలువతో ప్రత్యేకంగా సత్కరించారు.స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతకాలం బతికి ఉన్నామన్నది ముఖ్యం కాదని బతికి ఉన్నంత కాలం ఏమి సాదించామన్నదే ముఖ్యమన్నారు. అటువంటి కోవలో కల్నల్ సంతోష్ బాబు ఉంటారని ఆయన కొనియాడారు. చనిపోయి కుడా జాతి ఉన్నంత కాలం పేరు నిలబడడం కొందరికే వర్తిస్తుందని అందులో దివంగత సంతోష్ బాబు పేరు ఉండడం ఆయన అదృష్టమన్నారు.జాతి జీవించి ఉన్నంత కాలం వర్తమానానికి స్ఫూర్తినిచ్చే రీతిలో కల్నల్ సంతోష్ బాబు పేరు నిలిచిపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తక్కువ కాలంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి శ్రీనివాస రెడ్డిని అభినందించడం తో పాటు అందుకు నిరంతరం శ్రమించిన పురపాలక సంఘం పాలక వర్గాన్ని,మున్సిపల్ సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

యింకా ఈ కార్యక్రమంలో టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు తేర చిన్నపరెడ్డి లతో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, యన్. భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు,శాసన మండలి మాజీ సభ్యులు పూల రవీందర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మరో ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ మోహన్ రావు,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.