కేటిఆర్ బర్త్ డే : మంత్రి సబితమ్మ గిఫ్ట్ ఇదే

0
44

పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు జన్మదినం సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలను అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తాను శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు డిక్షనరీలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక తరగతులు నిర్వహించడం లేనందున ఎంపిక చేసిన పాఠశాలల్లోనే శనివారం పంపిణీ చేస్తున్నామని, ఇతర పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. అదే విధంగా ముక్కోటి వృక్షార్చన పేరిట రంగారెడ్డి జిల్లాలో ఒక సారి. లక్షలాది మొక్కలు నాటి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో పయనింపజేసేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావుకు జన్మదినం సందర్భంగా మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.