వారి పాలిట కేసిఆర్ దేవుడు : మనసున్న మారాజు

0
39

పేద ప్రజల పాలిటి దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్ లో 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 162 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ హేమలత లతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ముందుగా లబ్దిదారులు, బస్తీవాసులు మంత్రి, మేయర్ లకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న దేవాలయ పనులకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురైన పొట్టి శ్రీరాములు నగర్ ప్రజలకు తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా అన్ని వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చిందని వివరించారు. పేద ప్రజలు గొప్పగా బ్రతకాలనేదే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశయం అన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించి ఇరుకు ఇండ్లను నిర్మించి ఇచ్చేవారని, మన ముఖ్యమంత్రి కేసిఆర్ పేద ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉచితంగా నిర్మించి ఇస్తున్నారని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీ నుండి ప్రారంభమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం క్రింద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే అత్యధిక ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

పారదర్శక పద్దతిలో లబ్దిదారులకు ఇండ్ల కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇండ్లు పొందిన వారు ఒక కమిటీ గా ఏర్పడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇండ్ల సముదాయంలో 9 షాప్ లను నిర్మించడం జరిగిందని, వాటి ద్వారా వచ్చే అద్దెతో నిర్వహణ చేయాల్సిన బాద్యత కమిటీ చేపట్టాలని సూచించారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల క్రింద లక్ష 116 రూపాయలను మేనమామ కట్నంగా అందిస్తున్న గొప్ప మనసున్న మారాజు కేసిఆర్ అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంతో గొప్ప మనసుతో పేదప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని అన్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, ఆర్డీఓ వసంత కుమారి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిసి ముకుందరెడ్డి, హౌసింగ్ ఎస్ఈ సురేష్, ఈఈ వెంకటదాసు రెడ్డి, వాటర్ వర్క్స్ జిఎం రమణారెడ్డి, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, పద్మారావు నగర్ టిఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.