తుపాకి చేతపట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు..

0
34

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే, తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్లు స్వ‌రాజ్యం.. హైద‌రాబాద్‌లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మ‌ల్లు స్వ‌రాజ్యం మృతిప‌ట్ల సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా క‌మిటీ సంతాపం ప్ర‌క‌టించింది. మ‌ల్లు స్వ‌రాజ్యం అంత్య‌క్రియ‌లు ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో జ‌రుగుతాయ‌ని సీపీఎం న‌ల్ల‌గొండ జిల్లా కార్య‌ద‌ర్శి ముదిరెడ్డి సుధాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆమె వయస్సు 91 సంవత్సరాలు. మ‌ల్లు స్వ‌రాజ్యానికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె. కాగా, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్ , వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్ గా పని చేశారు.

అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం కూతురు పాదూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. పెద్ద కుమారుడి మల్లు గౌతమ్ రెడ్డి. ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా ,చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.