ఏపీలో నైట్ కర్ఫ్యూ షురూ – వీరికి మినహాయింపు

Night curfew begins in AP - the exception to this

0
37

ఏపీలో సంక్రాంతి సందర్భంగా వాయిదా పడిన నైట్ కర్ఫ్యూ ఇవాళ్టి నుంచి అమలు కానుంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రాష్ట్రమంతా కఠినమైన ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 31 వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.

అయితే ఈ ఆంక్షల నుండి కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు.

అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది.

అలాగే మాస్క్ ధారణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే జరిమానా ఉంటుంది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటివాటికి గరిష్టంగా 2 వందలమంది, ఇన్‌డోర్ అయితే 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అందరూ కోవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.