తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర..రూట్ మ్యాప్‌ ఖరారు

0
34

భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రతో కాంగ్రెస్ కు ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని అగ్రనేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎంపిక చేసిన 150 మందితో కలిసి రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తారు. ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రెండు దశాబ్ధాల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ చేయబోతున్న అతిపెద్ద ప్రచారమే కాకుండా..ప్రజలను కలిసేందుకు కాంగ్రెస్ చేపట్టబోతున్న అతిపెద్ద కార్యక్రమంగా భారత్ జోడో యాత్ర నిలవనుంది.

కాగా తెలంగాణాలో (భారత్ జోడో యాత్ర) రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇలా ఉండనుంది.  రాష్ట్రంలో 13 రోజుల పాటు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు, 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు.  12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్‌ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్‌ యాత్ర కొడంగల్, పరిగి, వికారా­బాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారు చేశారు.