సీఎం కేసీఆర్, కుమారస్వామి మధ్య జరిగిన చర్చ ఇదే..

0
45

తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ తో సహా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇక తాజాగా నేడు ప్రగతిభవన్ లో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కుమారస్వామికి, సీఎం కేసీఆర్‌ స్వయంగా ఎదురెళ్లి, సాదరంగా స్వాగతం పలికి.. తన వెంట తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ..సకలవర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఎంతో అవసరం ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి స్పష్టం చేశారు.

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ దేశం గర్వించే రీతిలో తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్..దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి తెలిపారు. సిఎం కెసిఆర్, త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి, దేశమంతా చర్చిస్తున్నదని, తమకూ ఈ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నదని ఈ సందర్భంగా కుమారస్వామి సిఎం కెసిఆర్ కు అభింనదనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోల్చి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాల పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తో కుమారస్వామి పంచుకున్నారు.

తెలంగాణ వంటి పాలన, పథకాలు,, కర్నాటక రాష్ట్రంతో సహా పక్క రాష్ట్రాల ప్రజలు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో, ఇదే విషయమై తమ దృష్టికి వచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ గారితో కుమారస్వామి చర్చించారు., తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీ ముక్త్ భారత్ కోసం సమిష్టి కృషి..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథాను, దాని పర్యవసానాలను చర్చించిన ఇరువురు నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకుంటామని వారిరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరమున్నదని వారు గుర్తించారు.

విఫలమైన కాంగ్రెస్..
కాగా, బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులే నేడు కనిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని వారు చర్చించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఒత్తిడి
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతున్న విషయాలను సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి వివరించారు. మతతత్వ బీజేపీపై, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని ప్రజలు హర్షధ్వానాలతో, నినాదాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని అన్నారు. చివరకు తమ సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు.

దేశంలో రైతు రాజ్యం రావాలె.
వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణలో మాదిరిగానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ, సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ దిశగా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రపాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతిని వారు ఖండించారు. వ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్నిరంగాలను అధోగతిపాలు చేస్తూ రోజురోజుకూ బీజేపీ పార్టీ దిగజారిపోతున్నదని వారు చర్చించారు.

దేశవ్యాప్తంగా రైతుల ఆహ్వానం
తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి వారు తెలుసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని, తమకూ తెలంగాణ మాదిరిగానే 24 గంటలు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందేలా చర్యలు చేపట్టాలని, అందుకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతు రాజ్య స్థాపనకు కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తూ, తనతో మూడు రోజులపాటు జరిగిన చర్చల విషయాన్ని సీఎం కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాపై చర్చ
త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. దేశ చరిత్రనే వక్రీకరిస్తూ కొనసాగుతున్న బీజేపీ విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను తుత్తునియలు చేయని పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని వారు తమ చర్చలో గుర్తించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకపోతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మౌలిక సమస్యలను గాలికొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని, అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.

కేసీఆర్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో చర్చ
దేశ రాజకీయాల్లో 75 సంవత్సరాల పాటుగా సాగుతున్న మూస రాజకీయాలకు దేశ ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ గురించి వారిద్దరూ చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయంగా మాట్లాడుకునే అసలు సిసలు రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. జాతీయ సమస్యలపై స్పందిస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, తాను చేపట్టిన పలు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు పలికిన ఆహ్వానాల తీరుతెన్నులపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా, దాదాపు మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిసాయి. అనంతరం ప్రగతి భవన్ నుంచి తిరిగి బయలుదేరిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా సిఎం కెసిఆర్ వీడ్కోలు పలికారు.