తెలంగాణలో మొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

తెలంగాణలో మొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

0
43

తెలంగాణలో మొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడ కృష్ణానగర్ కు చెందిన సుమయబాను, టోలిచౌకికి చెందిన మహ్మద్ ముజామిల్ షరీఫ్ కు 2017లో వివాహం అయింది. షరీఫ్ జెమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీలో కరస్పాండెంట్ గా పనిచేస్తుంటాడు. కాగా భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా సుమయబాను గత కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో 2018లో ఆమె భర్తపై మహిళా పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

అయితే భార్య తనపై కేసు పెట్టడం తట్టుకోలేకపోయిన షరీఫ్.. గతేడాది నవంబరు 28న భార్యకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అనంతరం మూడు సార్లు తలాక్, తలాక్ తలాక్ అని చెప్పాడు. ఇకపై మనిద్దరికీ ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో సుమయబాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు నాంపల్లి 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో ఆమె పిటిషన్ను కోర్టు అనుమతించలేదు.

అయితే తాజాగా ట్రిపుల్ తలాక్ చట్టం రావడంతో తన భర్తపై ఆ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది సుమయబాను. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు షరీఫ్ పై ట్రిపుల తలాక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ చట్టం కింద తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదేనని బంజారహీల్స్ పోలీసులు తెలిపారు.