కేసీఆర్, హరీశ్.. మీకు కొద్దిగైనా సిగ్గు అనిపిస్తలేదా? : వైఎస్ షర్మిల సీరియస్

0
41

• పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసం.?
• ప్రాణాలు పోతుంటే మీకేం పట్టనట్లు వ్యవహరిస్తారా.?
• ముంపు బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుది కాదా.?
• మల్లారెడ్డి ఆత్మహత్యకు కారకులు మీరు కాదా.?
• కేసీఆర్, హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలి.?
• సొంత ఇలాకాలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మీకు సిగ్గనిపించడం లేదా.?
• బంగారు తెలంగాణ అంటే.. ప్రజలు బలన్మరణాలకు పాల్పడటమా.?
• వేములఘాట్ లో 963 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసింది నిజం కాదా.?
• నిర్వాసితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన మాట వాస్తవం కాదా.?
• మీరు నిర్మించిన ఇళ్లు నాణ్యతా లోపంతో కూలుతున్నది నిజం కాదా.?
• ఇళ్లను కేటాయించారు సరే.. అధికారికంగా పత్రాలు ఎందుకు అందజేయలేదు.?
• సుదీర్ఘకాలంగా వెంకట్రామిరెడ్డి కలెక్టరుగా కొనసాగించడానికి కారణమేంటి?
• మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీ కమీషన్ల కోసం కాదా కేసీఆర్ సారూ.?
• మల్లారెడ్డి కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి
• రాష్ర్ట వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
• లేనిపక్షంలో బాధితుల పక్షాన పోరాడుతాం.. మీ భరతం పడతాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు వైఎస్.షర్మిల. పరిహారం అందక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే దొర గారికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. పనిలో పనిగా ఆర్థికమంత్రి హరీశ్ రావుపైనా ఆమె విరుచుకు పడ్డారు. సొంత ఇలాకాలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మామా, అలుళ్లకు కనీసం సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల వయసులో మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడంటే.. ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించి, ఆ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడో ఆలోచించాలన్నారు. మీ కుటుంబాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు ఆ బాధేంటో అర్థమవుతుందన్నారు. మల్లారెడ్డి ప్రాణం తీసిన పాపం కేసీఆర్, హరీశ్ రావులదేనన్న షర్మిల.. ఈ ఘటనకు వారిరువురే బాధ్యత వహించాలన్నారు.

ప్రాజెక్టుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు బతికే హక్కు కూడా లేదా అని వైఎస్.షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న మల్లన్నసాగర్ ముంపు బాధితుల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఐదేళ్లుగా అధికారులు నరకం చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి కావస్తున్నా పరిహారం చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఇల్లు, వాకిలీ, భూమిని స్వాధీనం చేసుకొని, నిలువ నీడలేకుండా చేసి వేధించడం ఎంత వరకు సమంజమని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే రైతు మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆమె ఆరోపించారు. మొదటి నుంచి ముంపు గ్రామాల ప్రజలపట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఏ కోశాన కనిపించడం లేదని షర్మిల విమర్శించారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం 2016 నుంచి భూసేకరణ చేస్తూ 2017 నుంచి పనులు ప్రారంభించినా.. పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం అడుగడుగునా బాధితులను ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్.షర్మిల ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూవేములఘాట్ లో 963 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిన మాట నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. 2019 నుంచి ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు, అర్హులుగా గుర్తించిన 6,800 మంది బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలన్నారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద పాత ఇంటిని వాల్యూయేషన్ చేసి, ఇళ్ల కేటాయింపు చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ దగ్గర ముత్రాస్ పల్లిలో 2,234 ఇళ్లు నిర్మించి కొందరికీ కేటాయించినా..ఇంకా 4,566 మంది బాధితుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల విషయంలో ఏ ఒక్కరికీ రిజిస్ట్రేషన్ చేయలేదని, అసలు ఏ ఇల్లు ఎవరికి కేటాయించారో అధికారిక ధ్రువీకరణ లేదని షర్మిల ఆరోపించారు.2020 ఏప్రిల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో కట్టించిన వెయ్యి ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉందని, మొన్న వచ్చిన చిన్నపాటి వర్షానికే ప్రహరీ గోడలు కూలిపోవడం, ఇంటి ముందు భూమి కుంగిపోవడం జరిగిందంటే.. ఇళ్ల నిర్మాణం ఎలా జరిగిందో అర్థమవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి ఏడాది కాకుండానే మరమ్మతులు చేయడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. కుంటలను మాయం చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లను నిర్మించడం ఎంత వరకు సమంజసమని వైఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019లోనే ముంపు బాధితుల కోసం 450 ఎకరాల్లో, ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీ నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి కావస్తున్నాఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు వైఎస్.షర్మిల. అంటే ముంపు బాధితుల సమస్యలపట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని ఆమె ఆరోపించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించే వరకు భూములను స్వాధీనం చేసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, కోర్టు ధిక్కారం కేసులు ఎదుర్కొంటున్న కలెక్టర్ వెంకటరామిరెడ్డిని, ముగ్గురు ఆర్డీవోలు, ఎమ్మార్వోలను ఒకే దగ్గర ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఒక కలెక్టర్ ను ఒకే దగ్గర ఏడేళ్లు కొనసాగించిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. అంతేకాదు.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 2019లో అర్హులకు స్వయంగా కలెక్టర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం దారుణమన్నారు. బౌన్స్ అయిన చెక్కులు వారి దగ్గరే ఉన్నాయని, కొందరికి ఇప్పటికీ పరిహారం అందలేదని దీనికి సీఎం కేసీఆరే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

అటు..మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటి గట్టుకిష్టాపూర్ గ్రామాలకు నీళ్లు, కరెంట్ నిలిపివేయడం ఏంటని షర్మిల ప్రశ్నించారు.ఒంటరి మహిళలు, పురుషులకు ఇల్లు, పరిహారం ఇవ్వకూడదని ఏ చట్టం చెబుతుందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితులకు సరైన పరిహారం, భరోసా ఇవ్వకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. అన్ని ప్రాజెక్టుల కింద ముంపు బాధితుల పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. ప్రజలను, వారి హక్కులను గౌరవించలేని కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని అన్నారు. మల్లన్న సాగర్ కింద సర్వస్వం కోల్పోయిన బాధితులు తెలంగాణ ప్రజలు కాదా అని ప్రశ్నించారు. తక్షణమే మల్లారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన నిలబడి పోరాడుతామని.. ఈ ప్రభుత్వం భరతం పడతామని షర్మిల హెచ్చరించారు.