యాదాద్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు..

Yadadri Brahmotsavala dates finalized ..

0
72

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయ్యాయి. మార్చి 4 నుంచి 14 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు ఇంకా 40 రోజులే మిగిలాయి.

మరోవైపు పంచ నారసింహుల ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా నిలిచిపోయిన గర్భాలయంలోని మూలవర్యుల నిజ దర్శనాలకు తెర తీసేందుకు ‘మహాకుంభ సంప్రోక్షణ’… తొలుత శ్రీ సుదర్శన మహా యాగం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువులకు రెండు వారాల ముందే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ మహాదివ్య పుణ్యక్షేత్రం ఖ్యాతి నలుదిశలా వ్యాపించేలా బాలాలయంలోనే వార్షిక ఉత్సవాలను 2017 నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి మార్చి4 నుంచి మొదలవుతాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణమహోత్సవం అదే నెల 11(నవమి)న నిర్వహిస్తారు. మార్చి 14న ఏకాదశి రోజున ఉత్సవాలు ముగుస్తాయి.

కొండపైన నిర్మితమవుతున్న నాలుగు అంతస్తులతో కూడిన దర్శన వరుసల సముదాయం మందిర రూపంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యుద్దీకరణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. సాలహారాల్లో దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరచాల్సి ఉంది. రెండు కనుమ దారుల మధ్య 40 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం పనులు ముమ్మరమయ్యాయి. మరో నెల రోజుల్లో పూర్తి అవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.