నెట్ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు..విధివిధానాలను విడుదల చేసిన ఆర్‌బీఐ

Digital payments without the net .. RBI has released the procedures

0
37

ఇంటర్నెట్‌ లేకున్నా (ఆఫ్‌లైన్‌) డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించాలని నిర్ణయించిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అందుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటివరకు ఆన్ లైన్ లోన్ చెల్లింపులు జరుగుతుండగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో చెల్లింపులు చేసేలా ఆర్‌బీఐ అమల్లోకి తెస్తోంది.

ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో, ఈ పథకాన్ని ఆర్‌బీఐ అమల్లోకి తెస్తోంది. కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సరిగా లేకపోతే డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఒక్కోసారి ఖాతాదారు బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్‌ అయినా..వ్యాపారికి చేరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు ఇంటర్నెట్‌ లేకున్నా.. ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని ఆర్‌బీఐ ఆవిష్కరించింది. కొన్ని ప్రాంతాల్లో 2020 సెప్టెంబరు నుంచి 2021 జూన్‌ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

తదుపరి ఒక్కో లావాదేవీకి రూ.200 మించకుండా, మొత్తం విలువ రూ.2,000 వరకు (బ్యాంకులో నిల్వను బట్టి) చెల్లింపు అనుమతిస్తూ విధివిధానాలను రూపొందించింది. ఈ ఆఫ్‌లైన్‌ లావాదేవీలను కార్డులు, వాలెట్లు, మొబైల్‌లు తదితరాలతో చేసేందుకు వీలుంది. ఈ లావాదేవీల్లో ఏర్పడే వివాదాలూ అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఈ ఆఫ్‌లైన్‌ చెల్లింపులు కచ్చితంగా సంబంధిత వ్యక్తులు ప్రత్యక్షంగా (ఫేస్‌-టు-ఫేస్‌) చేయాలి. వీటికి అదనపు భద్రతా ధ్రువీకరణ అవసరం లేదు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రం ద్వారా ఈ చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. అప్పటికప్పుడు దీనికి నెట్‌తో పని ఉండదు.