ఘోరం..పెళ్లింట మరణ మృదంగం..అసలేం జరిగిందంటే?

0
36

తెలంగాణలో ఘోరం జరిగింది.  తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగింది. జగిత్యాల జిల్లా అంబారిపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. శుభకార్యం పనులు జరుగుతుండగానే బామ్మర్దిపై బావ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన శంకర్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కారణం ఏంటంటే..

పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్‌ వీర్ల శంకర్‌ ఆయన చెల్లెలు జమునను అంబారిపేట వాసి ఆది వెంకటేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పూజిత. కొన్నాళ్లకు వెంకటేష్‌ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకటేష్‌ వ్యవసాయ భూమి మొదటి భార్య పేరిట ఉంది. అందులో కొంత భూమిని ఇటీవల వీర్ల శంకర్‌ విక్రయించాడు. ఆ సొమ్ముతో వెంకటేష్‌ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తన భూమిని విక్రయించాడన్న కోపంతో బావమరిది శంకర్‌పై వెంకటేష్‌ కక్ష పెంచుకున్నాడు. గురువారం పెద్ద కుమార్తె ప్రవళిక వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడిగుంజను కొట్టితెస్తుండగా వెంకటేష్‌ వచ్చి శంకర్‌తో గొడవకు దిగాడు. కోపం పట్టలేక గొడ్డలితో దాడి జరపగా తీవ్రంగా గాయపడిన శంకర్‌ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.