తిరుమల వెళ్లే భక్తులకు బంపరాఫర్..టికెట్ ధరలో 10 శాతం రాయితీ

0
38

తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రెండు వైపులా తీసుకుంటే.. టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

తిరుపతి వచ్చాక 72 గంటల పాటు తిరుపతి-తిరుమల టికెట్ చెల్లుబాటవుతుందని వెల్లడించారు. నేటి నుంచే ఈ కొత్త విధానం అమలు కానుంది. భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలేశుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మరో అవకాశం కూడా ఉంది. దేశంలోని పలు ప్రాంతాలు నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు ప్రతి రోజూ 1,000 దైవ దర్శనం టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు.. బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి.. వెంటనే శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. వీరి కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది.