కృష్ణానది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన : ఈ గ్రామాలకు మేలు

0
35

ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ 15.525 కి.మీ. మేర విస్తరణ
రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సీఎం వైయస్‌.జగన్‌ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం పనులకు శ్రీకారం చుడతారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు.

అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 15.525 కి.మీ పొడవునా రోడ్డును విస్తరిస్తారు. మొత్తంగా 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలు వాహనాలు వెళ్లడానికి, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారులను నిర్మిస్తున్నారు. ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్‌నిర్మించడం, వెంకటాయపాలెం, రాయపూడి అవుట్‌ఫాల్‌ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌ 1 నుంచి ఎన్‌ 3 రోడ్డులను ఉండవల్లి – రాయపూడి – అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి – చిన్నకాకాని – విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానిస్తారు.

తద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలకు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.