యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు : సిఎస్

0
37

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లను ఆదేశించారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎసి పి లతో నిర్వహించిన టెలికాన్ఫరేన్సులో వరదల పరిస్ధితిపై సమీక్షించారు.

జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షించాలని, ఎటువంటి ప్రాణ, ఆస్ధి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలలోని అన్ని శాఖలు సమన్యయంతో పనిచేయాలని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు గండ్లు పడకుండా చూసుకోవాలని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రధ్దవహించాలని తెలిపారు. అవసరమేరకు ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై ఆయా జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా తో సంప్రందించాలని తెలిపారు.

డిజిపి శ్రీ మహేంద్ర రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ కమల్ దీప్, డిజి ఫైర్ సర్వీసెస్ శ్రీ ఎస్ కె జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, సిఎండి NPDCL, శ్రీ గోపాల్ రావు, పంచాయతీ రాజ్ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ శ్రీ మురళీధర్ రావు, NDRF అధికారి శ్రీ దామోదర్ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.