షాకింగ్ న్యూస్ : హహాహా.. చాయ్ బిస్కెట్ల ఖర్చు రోజుకు 2 లక్షలట

0
36

రాజులు, రాజ్యాలు మాయమైపోయాయి. అధికార దర్పాలు అంతరించిపోయాయి… మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నం. ప్రజలే ప్రభువులు.. అని చాలామంది ప్రజాస్వామ్యం గురించి రాచరికం గురించి ప్రసంగాలు చేస్తుంటారు. కానీ అదంతా ఉత్తదే అని అప్పుడప్పుడు రుజువవుతుంటది.

నిజాం కాలంలో రాజు ఏది తలుచుకుంటే అది క్షణాల్లో జరిగిపోయేది. రాజావారు విందులు వినోదాలకే ధనమంతా ఖర్చు చేసేవారు. ఖరీదైన విందులు పసందుగా ఇచ్చేవారు. ప్రజల రక్తమాంసాలు పీల్చి పిప్పి చేసి రాజుగార్లు మాత్రం జల్సాలలో మునిగితేలేవారు. ఇది ఒక్క నిజాం కాలంలోనే కాదు చాలామంది రాజులు ఇలాగే వ్యవహరించేవారు.

ఇప్పుడు వర్తమానంలోకి వస్తే… తెలంగాణ రాష్ట్రంలో ప్రోటోకాల్ శాఖ అని ఒకటి ఉంటది. ఆ శాఖ వారు.. ఎవరైనా స్వదేశీయులు కానీ, విదేశీయులు కానీ మన రాష్ట్రానికి వచ్చే విఐపిలకు మంచి చెడ్డలు చూస్తుంటారు. సదరు విఐపిలు అనధికార పర్యటనలు కానీయండి, అధికారిక పర్యటనలు కానీయండి… వారి కోసం వసతి కల్పించేది ప్రోటోకాల్ డిపార్ట్ మెంటే. వాళ్లకు భోజనం, బస, చాయ్ లు, స్నాక్స్, ట్రాన్స్ పోర్ట్ లాంటివి అన్నీ ఈ శాఖ వారే అందించే బాధ్యతలు చేపడతారు.

అయితే సదరు శాఖ వారు ఆ డబ్బును ప్రజా ధనం నుంచే ఖర్చు చేయాలి. కానీ.. మన సొమ్ము కాదుగదా అనుకున్నరో ఏమో అడ్డగోలుగా ఖర్చు చేసేశారు. లెక్కలు పెట్టేశారు. రాష్ట్రానికి వచ్చే విఐపిలకు ఛాయ్ బిస్కెట్లకే రోజుకు రెండు లక్షల చొప్పున ఖర్చు అయిందని లెక్క రాశారు. అంటే ఈలెక్కన ఏటా ఛాయ్ బిస్కెట్లకు 8 కోట్లు కరిగించి పారేశారు.

అంతేకాదండోయ్ ప్రొటోకాల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కు ప్రభుత్వ వాహనాలున్నప్పటికీ ప్రముఖులు వచ్చినప్పుడు ఖరీదైన కార్లు కిరాయికి తీసుకున్నట్లు కూడా లెక్కలు రాసేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్ల అద్దె కోసం బడ్జెట్ పద్దు 134 కింద 8.9 కోట్లు కేటాయించారట. చాయి బిస్కెట్లకు 8 కోట్లు, ఖరీదైన కార్లు కిరాయికి తెచ్చినందుకు దగ్గగ దగ్గర 9 కోట్లు ఖర్చు చేసేశారు.

ఈ లెక్కలన్నీ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన వేదిక) కార్యదర్శి పద్మనాభరెడ్డి జమచేసి గవర్నర్ తమిళిసై కి లేఖ రాశారు. ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ వారు అడ్డగోలు ఖర్చులు చూపుతూ డబ్బు నొక్కేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు. పై రెండు పద్దుల లెక్కల మీద అనుమానాలున్నాయని నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.

వీలైతే విజిలెన్స్ లేదంటే ఎసిబితో విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు బయటకొస్తాయని పద్మనాభరెడ్డి సూచించారు. పాత కాలంలో ఒక సామెత ఉండేది… రాజుల సొమ్ము రాళ్ల పాలు అని… కానీ ఇప్పుడు వీళ్లు మాత్రం ప్రజల సొమ్ము మా పాలు అని నాకి పడేస్తున్నారన్నమాట.