‘కేసీఆర్ ను ప్రధానమంత్రిగా చూడాలనుంది’

0
31

ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు 3 రోజుల పాటు జన్మదినవేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బాపూజీ నగర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ కు జరిగిన అన్యాయంపై బోధించి, సమీకరించి 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారన్నారని గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యం పండుతుందని,విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పారు.నేడు తెలంగాణలో మూడెకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడన్నారు.

ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు చూసి పొరుగు రాష్ట్రాల బార్డర్ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామాలు విలీనం చేయాలని అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారని అన్నారు.స్వయంగా కర్ణాటక మంత్రి కూడ తమ ప్రాంతాన్ని తెలంగాణ లో కలపాలి అని అన్నాడని అన్నారు.రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నాయన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం దేశానికే ఒక మోడల్ గా నిలిచిందన్నారు.

ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న కేసీఆర్ ను ప్రజలు భారత దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు కూడా కేసీఆర్ ను ప్రధానమంత్రిగా చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.జీవితాంతం ఆయన ప్రజా పాలనలో కొనసాగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మండల పార్టీ ప్రెసిడెంట్, జడ్పీటీసీ, ఎంపిపి, భీంగల్ మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.