రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలి

Rajasinghe should be arrested immediately

0
34

యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓట్లు వేయని వారి ఇండ్లపై జేసీబీలు, బుల్‌డోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. యోగీ శత్రువులంతా ఒక్కటే, ఆయనను ఎన్నికల్లో ఓడించాలని చూస్తున్నారనీ, ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినట్టు కనిపిస్తున్నదని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘యూపీలో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇంకా ఐదు దశలున్నాయి. ఇప్పటికే జేసీబీలు, బుల్‌డోజర్లు తెప్పించాం. ఎవరైనా యోగీకి వ్యతిరేకంగా ఓటేస్తే వాటితో తొక్కిస్తాం. అలా ఓటేయాలనుకునే వారు ఉత్తరప్రదేశ్‌లో ఉండరు. రాష్ట్రం విడిచి వెళ్లిపోవాల్సిందే’అని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఇంత బాహాటంగా చట్టబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే బెదిరిస్తూ మాట్లాడ్డం చట్టవిరుద్ధమని తెలిపారు. ఎవరికైనా ఓటేసుకోండి, కానీ పరిపాలన బీజేపీ చేస్తుందంటూ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల్లో అదే జరుగుతున్నదనీ, బీజేపీని ఓడించినా, గెలిపించినా, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి, డబ్బులిచ్చి కొనుగోలు చేసి బీజేపీ పాలిస్తున్నదని వివరించారు.

ఇప్పుడు రాజాసింగ్‌ ఏకంగా యోగీకి వ్యతిరేకంగా ఓట్లు వేయొద్దని బహిరంగంగా మాట్లాడితే పోలీసులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు. తక్షణమే ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించి రాజాసింగ్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసిఆర్‌ ప్రభుత్వం రాజాసింగ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

( జె బాబూరావు)
ఆఫీసు కార్యదర్శి