హుజూరాబాద్ లో దొరలు, పటేళ్ల పోటీ, మేము ఎటువైపంటే : మంద కృష్ణ మాదిగ

0
161

హుజూరాబాద్ ఎన్నికలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో ఒకవైపు దొరలు, మరోవైపు పటేండ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ అధ్యయన వేదిక నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మంద కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్…

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఓడాలని మీలో కొందరు కోరుకుంటున్నారు. కానీ దొరలను ఓడించడమో పటేళ్లను గెలిపించడమో మా విధానం మాది కాదు. దొరలు, పటేల్లకు మేమే ప్రత్యామ్నాయం. హుజురాబాద్ లో దళితులు ఎక్కువగా ఉన్నందునే సీఎం కేసీఆర్ ఈ సమయంలో దళిత సాధికారత ను తెరపైకి తీసుకు వచ్చారు.

దళితకోణంలో చూస్తే సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు. కేసీఆర్ కు దళితుల సాధికారత పట్ల చిత్తశుద్ధి లేదని ఏడేళ్ల పాలనలో తేలిపోయింది. దళితుల సాధికారత ను చంపి వేసిందే కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో అయనతో కలిసి సైద్ధాంతిక పోరాటం సాగించాం.‌ జర్నలిస్టులు, దళిత మేధావులు,ప్రతిపక్షా నేతలు కేసీఆర్ గడీలో బందీలయ్యారు. మభ్య పెట్టడం, మోసం చేయడం అనేది కేసీఆర్ కు అలవాటు. దళితుల మద్దతు కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం దళితుడే అని 2002  నుండి 2013 వరకు మభ్యపెడుతూ వచ్చాడు. కేసీఆర్ పదే పదే నమ్మించి మోసగించడం అలవాటుగా చేసుకున్నారు.

సీఎం నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో దళిత నేతలు చచ్చిన పాముల్లా పడి ఉన్నారు. ప్రతిపక్షాల నేతలు మౌనం, భజనకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఏపీలో దళితులు మంత్రి వర్గంలో అరు మంది ఉంటే అందులో తెలంగాణ వారు ముగ్గురు ఉండేవారు. తెలంగాణ వచ్చిన తరువాత జనాభా ప్రకారం నాలుగు పదవులు రావాలి. కానీ కేసీఆర్ కేవలం ఒక్కరికే అవకాశం ఇచ్చారు.  సమర్ధుడైన కడియం శ్రీహరిని ఎందుకు కేబినెట్ లోకి తీసుకోలేదు.

తెలంగాణ రావడానికి కేసీఆర్ కాదు, 12 వందల మంది బలిదానాలు.. లక్షల మంది బహుజనుల పోరాటమే కారణం. ధూంధాం కోట్ల మంది ని చైతన్యం కలిగించింది. అమరుల త్యాగాల్లో దళితుల భాగస్వామ్యం 28  శాతంగా ఉంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఒక్క వెలమ‌ పేరు చెప్పండి? తెలంగాణ ను సీమాంధ్రులు అడ్డుకున్నప్పుడు అండగా నిలిచింది మేమే కదా?. ఒక్క శాతం లేని వెలమలకు 8 శాతం మంత్రి పదవులా?

ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ వంటి ఎందరో మేధావులు కేసీఆర్ చుట్టూ చేరిపోయారు. ఆరువేల మందికి మూడెకరాల భూమిని పంచి.. లక్ష ఎకరాలకు పైగా లాక్కున్నారు. వరంగల్ కలెక్టరేట్, పోలీసు కమీషనర్ కార్యాలయం దళితుల భూమిని బలవంతంగా గుంజుకుని నిర్మించారు.  ఆ భూముల విలువ ఎకరా రెండు కోట్లు పలుకుతున్నాయి. కాబట్టే గుంజుకున్నారు.

తెలంగాణ రాక ముందు ఏడు లక్షల మంది దళితులకు అసైన్డ్ భుములు ఉంటే ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది తప్ప పెరగడం లేదు. ఫార్మా కంపెనీలకు, ప్రాజెక్టులకు, దేవాలయాల నిర్మాణానికి భూములు దొరుకుతాయి కానీ,

దళితుల కోసం భూములు దొరకడం లేదా?. పది లక్షలకు ఎకరం లెక్కన కొని ఇప్పించడం ఇష్టం లేదు కేసీఆర్ కు.

దళితులు, బహుజనులు కేసీఆర్ మోసాలను గ్రహించినప్పుడు, కేసీఆర్ భ్రమల నుండి బయట పడ్డప్పుడు ఖచ్చితంగా వెలమ దొరల గడీల పాలన అంతం అవుతుంది. టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రత్యామ్నాయం కానేకాదు. మా జాతుల కోసం పోరాటం సాగిస్తున్న మేము మాత్రమే ప్రత్యామ్నాయం. కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, వామపక్షాలు ఈ విషయాలపై కేసీఆర్ ను నిలదీయలేదు. దొరల తెలంగాణ ను గద్దె దించి సామాజిక తెలంగాణ సాధిస్తాం. మీడియా వారు దయచేసి నిజాలను దాయకండి. మేం కేసీఆర్ చేసిన మోసాల గురించి చెప్పిన నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్లండి. సామాజిక తెలంగాణ నే కేసీఆర్ కు నిజమైన ప్రత్యామ్నాయం.

త్వరలో 119 నియోజకవర్గాలలో పాదయాత్ర/ సైకిల్ యాత్రలు నిర్వహించి కేసీఆర్ అవకాశవాదాన్ని ఎండగడతాం. కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని ఇచ్చిన హామిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. కాని మాజి ప్రధాని పీవి నరసింహారావు విగ్రహాన్ని మాత్రం పెట్టారు. పీవి ప్రధానిగా కొనసాగి ఉండవచ్చు. అట్లా చాలా మంది ప్రధానులుగా కొనసాగారు. కానీ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఒక్కరే కదా?.

ఏఐసిసి ప్రకటించిన తెలంగాణ పిసిసి కమిటిలో కుడా దళిత సాధికారత లోపించింది. కమిటీలో దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కలేదు. కాబట్టి టీఆర్ఎస్ వెలమ దొరల పార్టీ.. కాంగ్రెస్ రెడ్డీల పార్టీ గానే పరిగణిస్తాం.

వైఎస్ రాజశేఖరరెడ్డి మానవతావాది. తెలంగాణను అడ్డుకోవడానికి రోడ్డు మీదకు రాలేదు. రాయలసీమ పట్ల అభిమానం ఉంటె ఉండొచ్చు. రాక్షసుడు అని విమర్శిస్తున్న వాళ్లు ఆనాడు ఆయన పాలనలో మంత్రులుగా ఎందుకు కొనసాగారు. రాక్షసుడి పక్షాన మీరెందుకు ఉన్నారో చెప్పాలి.

మంద కృష్ణ మాదిగ మాట్లాడిన వీడియో చూడండి….