రేవంత్ రెడ్డి మరోసారి ఛలో రాజ్ భవన్

0
36

నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఛలో రాజ్ భవన్ పిలుపు ఇచ్చి నానా హడావిడి చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రసిడెంట్ అయిన తర్వాత పార్టీ శ్రేణులను కలిదించిన మొదటి కార్యక్రమం అది. రాజ్ భవన్ పిలపులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. అయితే పార్టీలో ఈ కార్యక్రమం ఒక ఊపు తీసుకొచ్చింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూలై 22న మరోసారి ఛలో రాజ్ భవన్ చేపట్టనున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ పిలుపు కూడా మోదీ సర్కారుకు వ్యతిరేకంగానే. దేశ ప్రజల ప్రాథమిక హక్కైన వ్యక్తిగత గోప్యతకు తూట్లు పొడుస్తూ మోదీ సర్కారు ‘’పెగాసెస్’’ స్పైవేర్ తో నిఘా పెట్టడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడమే అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం చేసిన చర్యకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఛలో రాజ్ భవన్ లో పాల్గొని, విజయవంతం చేద్దామని శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. జూలై 22న ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో సమావేశమై రాజ్ భవన్ కు వెళ్లి నిరసన తెలిపేందుకు కదిలిరావాలని కేడర్ కు సూచించారు. ఈ మేరకు గాంధీభవన్ నుంచి ప్రకటన జారీ అయింది.