మోసం చేసినందుకు కేసిఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలా?

0
41

దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే కేసిఆర్ కు దళిత నేతలు పాలాభిషేకాలు చేయడం దారుణం అని టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మండిపడ్డారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లు రవి కామెంట్స్…

దళిత బంధు పేరుతో కెసిఆర్ కి క్షీరాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసం. తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తా అని కెసిఆర్ మాట తప్పారు. దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తల నరుక్కుంటా ఉన్న వీడియోని ఇప్పటికీ ప్రజలు చూస్తున్నారు. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను కొద్దికాలంలోనే తీసేసారు…ఎందుకు తీసేసారో ఇప్పటివరకు చెప్పలేదు.

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులను కూడా దారి మళ్లించారు. దళిత బంధువా.. దళిత వ్యతిరేకా? దళితులకి 65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేదని కెసిఆర్ ఒప్పుకున్నారు. కెసిఆర్ నూటికి నూరుపాళ్లూ దళిత వ్యతిరేకే. సీఎం కేసీఆర్ వల్లే దళితులు అభివృద్ధి చెందలేదు. దళితుల పేరుతో కేసిఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది.

దళితులకి 10 లక్షలు ఇవ్వడం మేము వ్యతిరేయకం కాదు. దళిత సాధికారత స్కీమ్ను ఓట్ల కోసమే కాకుండా ఆ వర్గాలకు ఉపయోగపడే స్కీముగా అమలు చేయాలి. దళితులకి 32 వేల ఉద్యోగాలు రాకుండా చేశారు కేసీఆర్. ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమయింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని కెసిఆర్ దళిత బంధువా .. దళిత వ్యతిరేకినా తేల్చుకోవాలి.

2014 ,2018లో కెసిఆర్ ని ప్రజలు నమ్మారు ఇక నమ్మరు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే పైలెట్ ప్రాజెక్టుగా దళిత సాధికారతపై స్కీమును పెట్టారు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పి దళితుల వద్దకు వెళ్ళండి. అన్ని జిల్లాల్లో దళిత బంధు స్కీం ను అమలు చేయాలి.