పాడి కౌషిక్ రెడ్డిపై ఉత్తమ్ సీరియస్

0
41
Uttam Kumar Reddy

హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌషిక్ రెడ్డి ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షురాలికి పంపిన తర్వాత మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే మణికం ఠాగూర్ మీద కూడా ఆరోపణలు చేశారు. 50 కోట్లు పెట్టి పిసిసి చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి కొనుక్కున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పాడి కౌషిక్ రెడ్డి సోదరుడైన మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం బెంగుళూర్ జిందాల్ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాడి కౌషిక్ రెడ్డి కామెంట్స్ చూసిన తర్వాత ఉత్తమ్ ఒక ప్రకటన వెలువరించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడని గుర్తు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు అని తెలిపారు.

padi kaushik reddy

కాంగ్రెస్ నాయకులపై పీసీసీ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మాటలు టిఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలే అన్నారు. ఇప్పటికే కౌషిక్ ను పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎవరైనా నాయకులు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని చురకలు వేశారు. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. టిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.