ప్రధాని మోదీ కీలక ప్రకటన..జనవరి 3 నుండి పిల్లలకు టీకా

Prime Minister Modi's key statement .. Vaccine for children from January 3

0
35

గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అలాగే 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.  ఇంతవరకు అందరూ బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతుండగా ప్రధాని తొలిసారిగా ‘ప్రికాషన్‌ డోసు’ అనే పదబంధాన్ని ప్రయోగించారు. పండగల సమయంలో అప్రమత్తంగా ఉంటూ.. మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు.

దేశంలో ప్రస్తుతం 18 లక్షల ఐసొలేషన్‌ పడకలు, 5 లక్షల ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. పిల్లల కోసమే ఐసీయూతో కలిపి 90,000 పడకలు ఉన్నాయి. వ్యాక్సిన్ల అవసరాన్ని తగినంత ముందే గుర్తించి, అనుమతుల నుంచి సరఫరా, పంపిణీ, శిక్షణ సహా అన్నీ సత్వరం పూర్తయ్యేలా దృష్టి సారించాం. వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రధాని చెప్పారు.