మీరు మోసాలు చేస్తుంటే మేము చెక్కభజన చేయాలా? : డికె అరుణ సీరియస్

dk aruna fire on trs dk aruna vs trs dk aruna comments on etala issue

0
34

ప్రజలను మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం

అబద్ధాలు ఆడడం లో సీఎం కేసీఆర్ నెంబర్ వన్

ఆత్మ గౌరవం లేని వారే టిఆర్ఎస్ లో ఉన్నారు

జూమ్ మీటింగ్లో ధ్వజమెత్తిన బిజెపి నేషనల్ వైస్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి డీకే అరుణ

అబద్ధాలు ఆడుతూ.. ప్రజలను మోసాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి డికె అరుణ హెచ్చరించారు. అబద్ధాల పునాదిపై ఏర్పడ్డ టిఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా తెలంగాణ ప్రజలను దగా చేస్తుందన్నారు.

ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు చెబుతుంటే మేము చెక్క భజన చేయబోమని, తగిన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు. ఆత్మ గౌరవం లేని వారే టిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారని విమర్శించారు. కెసిఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఇతరులను ఆత్మ గౌరవం లేదని చెప్పడం వారి అవివేకమని ఆమె ఆరోపించారు.

ప్రతిసారి సీఎం కోటి ఎకరాల మాగాణి తెలంగాణ అంటున్నారని కానీ కోటి ఎకరాల్లో ఎంత టైం పడుతుంది ఎలా కొనుగోలు చేయాలి అనే దానిపై సోయి చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యానికి గోనె సంచులు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు.

రైతు రుణమాఫీ ఎక్కడికి పోయిందని.. దళిత ముఖ్యమంత్రి ఏమైందని.. 12 శాతం ముస్లింల రిజర్వేషన్ మరిచారని.. గొర్రెల పథకం అడ్రస్ లేకుండా పోయిందని విమర్శల వర్షం కురిపించారు. ఇలా ఎన్నో పథకాలను నీరుగార్చి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలలో అక్కడి బిజెపి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఇస్తున్నారని కానీ తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు.