IPL 2022- మెగా వేలం నిబంధనలివే..!

IPL 2022- Mega auction rules are the same ..!

0
38

ఐపీఎల్​ 2022 సీజన్​ కోసం క్రికెటర్ల మెగా వేలం ప్రక్రియ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సీజన్​లో కొత్తగా చేరిన రెండు జట్లతో కలిపి 10 టీమ్​లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్, మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ప్రకటించింది బీసీసీఐ. ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో ప్రాంఛైజీకి రూ.90 కోట్ల పరిమితి ఇచ్చింది.

కొత్త నిబంధనలు తెలుపుతూ అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ లేఖ పంపింది. ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 42 కోట్లు, ముగ్గురిని అట్టిపెట్టుకుంటే రూ.33 కోట్లు ఖర్చు చేయాలని తెలిపింది. ఇద్దరు ఆటగాళ్లను ఓ జట్టు రిటైన్ చేసుకుంటే జట్టు పర్సు వాల్యూ నుంచి రూ. 24 కోట్లు ఖర్చు చేసినట్లు. ఒక్క ఆటగాడినే అట్టిపెట్టుకుంటే రూ. 14 కోట్లు ఖర్చు చేసినట్లు.” అని ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఆటగాడి రిటెన్షన్ ఖర్చు ప్రతిసారి ఒకేవిధంగా ఉండదని పేర్కొన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం..గత సీజన్లో ఆడిన ఎనిమిది జట్లలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. మిగతా క్రికెటర్లంతా వేలంలోకి రానున్నారు.

రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లలో..ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు. ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ఆటగాడైనా ఉండొచ్చు.

వేలానికి అందుబాటులో ఉన్న మొత్తం ఆటగాళ్ల నుంచి రెండు కొత్త జట్లకు (అహ్మదాబాద్, లఖ్​నవూ) ఒకేసారి ముగ్గురు ప్లేయర్స్​ను ఎంపిక చేసుకునే హక్కు ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ విదేశీ ఆటగాడు ఉండాలి.

అన్​క్యాప్డ్​ ఆటగాళ్ల విషయానికొస్తే.. పాత జట్లు ఇద్దరిని, కొత్త జట్లు ఓ అన్​కాప్డ్​ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

జనవరి ఆరంభంలో మెగా వేలం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు బీసీసీఐ లేఖలో పేర్కొంది. నవంబర్​ నెలలో 8 ఫ్రాంఛైజీలు రిటెన్షన్​పై ఫోకస్ చేయాలి. డిసెంబర్ 1-25 మధ్య రెండు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో ఉండాలని స్పష్టం చేసింది.

రిటైన్​ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను బట్టి నాలుగు స్లాబ్​లు ఉంటాయి. ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల సంఖ్యను బట్టే ఒక్కో ఆటగాడి ఫీజును నిర్ణయిస్తారు.

నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే అది స్లాబ్ 1. ఇందులో మొదటి ఆటగాడికి రూ. 16 కోట్లు, రెండో ప్లేయర్​కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్​కు రూ. 8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 6 కోట్లు ఖర్చు చేయాలి. అంటే జట్లు పర్సులోని రూ.90కోట్ల నుంచి రూ. 42 కోట్లు కోతకు గురవుతుంది. ఇక మిగిలిన రూ. 48 కోట్లతోనే ఫ్రాంఛైజీ.. మిగతా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

స్లాబ్ 2లో.. ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మొదటి ఆటగాడికి రూ. 15 కోట్లు, రెండో ప్లేయర్​కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 7 కోట్లు ఖర్చు చేయాలి. అంటే.. ఫ్రాంఛైజీ పర్సు నుంచి రూ. 33 కోట్లు ముందుగానే ఖర్చవుతుంది. రూ. 57 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.

స్లాబ్​ 3లో.. ఇద్దరు ఆటగాళ్లనే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆటగాడికి రూ. 14 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 10 కోట్లు ఫ్రాంఛైజీ ఖర్చు చేయాలి. అంటే జట్టు పర్సు నుంచి రూ. 24 కోట్లు పోగా.. రూ. 66 కోట్లు ఇతర క్రికెటర్ల వేలం కోసం ఉపయోగించొచ్చు.

స్లాబ్​ 4లో.. ఒకే ఆటగాడిని రిటైన్ చేసుకోవాలి. ఫ్రాంఛైజీ పర్సు నుంచి రూ. 14 కోట్లు పోగా.. మిగతా రూ. 76 కోట్లను ఇతర క్రికెటర్ల వేలం కోసం ఉపయోగించుకోవచ్చు.

ఒకవేళ అన్​క్యాప్డ్​ ఆటగాడిని రిటైన్ చేసుకుంటే..ఆ ప్లేయర్​ పేరిట రూ. 4 కోట్లు మాత్రమే పర్సు నుంచి తొలగిస్తారు.