ధోని ఎక్కువగా దర్శించే అమ్మవారి దేవాలయం ఇదే

This is the most visited temple of Dhoni

0
56

మన దేశంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతలు చాలా మంది ఉన్నారు. అలాంటి అమ్మవారు దేవోరి మాత. ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఎక్కువగా ఈ ఆలయానికి వస్తారు. విజయాలు కలిగించే దేవతగా ఈ అమ్మవారిని బాగా కొలుస్తారు.

ఈ ఆలయం ఝార్ఖండ్ లో ఉంది. రాంచీ టాటా హైవే పై ఉన్న ఈ ఆలయంలో దుర్గామాతను కొలుస్తారు. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉంది ఈ అమ్మవారి ఆలయానికి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తుండి, 16 చేతులతో దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని చరిత్ర ప్రకారం చూస్తే 1300 సంవత్సరంలో నిర్మించారు అని తెలుస్తుంది.

ఇక్కడ ఆనాటి నుంచి స్ధానికులు పూర్వీకులు చెప్పేదాని ప్రకారం, సింహభూమికి చెందిన ముండా రాజు కేరా, ఓ యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ గుడి నిర్మించిన కొన్ని రోజులకి ఆ రాజు మళ్లీ తన రాజ్యం సంపాదించుకుని పాత వైభవం పొందారట. ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఝార్ఖండ్ లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అనుసరిస్తూ పూజలు చేస్తారు.

ఆదివాసీలు అమ్మవారిని 6 రోజులు పూజించగా, మిగిలిన ఒక్కరోజు బ్రాహ్మణులు పూజ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారిని ఏదైనా కోరుకుంటే కచ్చితంగా అది నెరవేరుతుందని, ఇక్కడకు వచ్చి వెళ్లిన వారికి ఏ పని తలపెట్టినా విజయం వస్తుంది అని నమ్ముతారు. ఇక్కడ అమ్మవారికి నవరాత్రి సమయంలో ఉత్సవాలు చేస్తారు లక్షలాది మంది భక్తులు వస్తారు.