భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా

India-New Zealand first Test draw

0
83

కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

రెండో ఇన్నింగ్స్​లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఓ వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది. ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్​కు శుభారంభమే దక్కింది. లాథమ్, సోమర్​విల్లే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు.

ఇక నైట్ వాచ్​మెన్​గా వచ్చిన సోమర్​విల్లే (36), తర్వాత టేలర్ (2), నికోలస్ (1), విలియమ్సన్ (24) వెంటవెంటనే ఔట్ కావడం వల్ల భారత శిబిరంలో విజయావకాశాలపై ఆశలు చిగురించాయి. కానీ చివర్లో రచిన్ రవీంద్ర, జేమిసన్​ భారత బౌలర్లపై ఆధిపత్యం వహించారు. పరుగులు సాధించలేకపోయినా డిఫెన్స్​తో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.

ఎంతో ఓపికతో ఆడిన జేమిసన్​ (5)ను జడేజా ఔట్ చేయడం వల్ల మరోసారి భారత అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత్​కు విజయం దక్కాలంటే మరో రెండు వికెట్లు కావాలి. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కాసేపటికి సౌథీ (4)ని పెవిలియన్ చేర్చి భారత్​ను గెలుపు తీరానికి మరింత దగ్గర చేశాడు జడ్డూ. కానీ చివర్లో రవీంద్ర (18*), అజాజ్ (2*) చివరి వికెట్ పడకుండా అడ్డుకుని మ్యాచ్​ను డ్రాగా ముగించారు.