బాబు కేబినెట్ విస్తరణలో బెర్తులు ఎవరికో?

బాబు కేబినెట్ విస్తరణలో బెర్తులు ఎవరికో?

0
204

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విస్తరణ జరిగితే భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా..? లేదంటే బీజేపీ వదులుకున్న రెండు మంత్రి పదవులకే పరిమితమవుతారా..? ఆ రెండు బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఇదే అంశంపై చర్చ కొనసాగుతోంది.

కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా తర్వాత ఖాళీ అయిన వైద్యఆరోగ్య శాఖతో పాటు దేవాదాయ శాఖను కొత్త వారికి అప్పగించాలనే యోచనలో సీఎం ఉన్నారని తెలియడంతో మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్లు ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పట్లో స్పష్టత రాకపోయినా నెల రోజుల లోపే మంత్రి వ‌ర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనితో మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న ఆశావాహ‌లు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో ముస్లిం నాయకుడికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్‌ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ షరీఫ్‌ ప్రస్తుతం మండలి నుంచి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. జలీల్‌ ఖాన్‌ ఇటీవల రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధ్యక్షునిగా నియమితులయ్యారు. వీరిలో ఫరూక్‌ రాయలసీమ వారు కాగా షరీఫ్‌ కోస్తా నాయకుడు. మైనారిటీల సంఖ్య రాయలసీమలో అధికంగా ఉండటంతో ఫరూక్‌ చేత మండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేయించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే లంచం పై పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.