ఐపీఎల్: ఉత్కంఠ పోరులో SRH గెలుపు..తృటిలో ఓడిన బెంగళూరు

0
33

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊరట విజయం లభించింది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరు 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. తొలుత బ్యాట్‌తోను, ఆ తర్వాత బంతితోను రాణించిన హైదరాబాద్ ఖాతాలో మూడో విజయం చేరడం ఒక్కటే దానికి ఊరట.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నా, క్రీజులో డివిలియర్స్ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. 137 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించి ఓటమి పాలైంది.

భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. అయితే, నాలుగో బంతికి ఏబీ సిక్సర్ కొట్టడంతో ఉత్కంఠ రేగింది. అయితే, ఆ తర్వాత రెండు బంతులను భువీ పకడ్బందీగా సంధించడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 44, కెప్టెన్ విలియమ్సన్ 31, ప్రియంగార్గ్ 15, హోల్డర్ 16 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసుకోగా, క్రిస్టియన్ రెండు, చాహల్, గార్టన్ చెరో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.